సొంత నియోజకవర్గం పులివెందులలో పలు కార్యక్రమాలతో సీఎం జగన్ బిజీ

  • నేడు పులివెందుల పర్యటనకు విచ్చేసిన సీఎం జగన్
  • వైఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం
  • వైఎస్సార్ మినీ సెక్రటేరియట్, స్మారక పార్క్ లను ప్రారంభించిన వైనం 
ఏపీ సీఎం జగన్ ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వచ్చారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల చేరుకున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

తొలుత పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాలను 51 ఎకరాల్లో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభం కానుంది. వైఎస్సార్ ఆసుపత్రి, వైద్య కళాశాల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సీఎం జగన్ కు వివరించారు. 

అనంతరం సీఎం జగన్ పులివెందులలో అరటికాయల సమీకృత ప్యాకింగ్ హౌస్ ను ప్రారంభించారు. ఈ ప్యాకింగ్ హౌస్ ను రూ.20 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 

సీఎం జగన్ తన పులివెందుల పర్యటనలో భాగంగా డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ సముదాయాన్ని, వైఎస్సార్ స్మారక పార్క్ ను కూడా ప్రారంభించారు. ఈ పార్క్ నిర్మాణానికి రూ.39.13 కోట్లు ఖర్చు చేశారు. ఇక, బిర్లా గ్రూప్ నకు చెందిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఫేజ్-1 యూనిట్ కు ప్రారంభోత్సవం చేశారు.

CM Jagan
Pulivendula
Development
Inaugurations

More Telugu News